A Detailed Information about all Temples
http://www.templedetails.com/

Friday, March 15, 2013

రామానుజ సాంప్రదాయంలో

 "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు

14. రామానుజ సాంప్రదాయంలో

రామానుజ సాంప్రదాయములో పరస్పరము మర్యాద చేసుకోవడంలో చాలా శ్రద్ధ వహిస్తారు. మనం నీవు-మీరు అని వ్యవహారంలో చెప్పుకుంటే వారు దేవరీర్ (తమిళం) అన్నపదం వాడతారు. తమని దాసులు అని చెప్పుకుంటారు. ఇతర సాంప్రదాయస్తులను 'స్వామీ' అని పిలుస్తారు. వైష్ణవులలో వృద్ధులను 'పెరుమాళ్' అని వ్యవహరిస్తారు. వారి మర్యాద ఒక్కొక్కప్పుడు విపరీత ప్రమాణంలో ఉంటుంది.

ఈ విషయంలో చెప్పుకునే కథ తమాషాగా ఉంటుంది. ఒక మఠాధిపతి క్రింద శిష్యుడొకడు ఉండేవాడు. గురువు స్థానంలో తాను రావాలని అతనికి ఆశ. గురువు కోసం అతనొక గోతిని త్రవ్వినాడి. గురువు దగ్గరకు వెళ్ళి 'దేవతలైన తాము (దేవరీర్) స్వయంగా గోతిలో దూకుతారా? లేక ఈ దాసుణ్ణి ఆ కైంకర్యం చెయ్యమంటారా? అని మర్యాదతో అడిగాడట.


వైష్ణవాలయాలలో ఆళ్వారుల సన్నిధులుంటాయి. అందులో ఆండాళ్ సన్నిధి విశేషమైనది. తెంగల శాఖకు చెందిన మనవాళముని, పిళ్ళైలోకాచార్యుల సన్నిధులు ఉంటాయి. వడగలైశాఖకు చెందిన ఆలయాలలో వేదాంతదేశికుల సన్నిధి ఉంటుంది. రామానుజులు శ్రీపెరంబదూరులో జన్మించారు. ఆ క్షేత్రంలో రామానుజులకే ప్రాధాన్యం. పెరుమాళ్ళకు రెండవ స్థానమే. అచట రామానుజులకు పదిరోజుల ఉత్సవం చేస్తారు. రోజూ ఆరాధన, ఆయన సన్నిధి మీద బంగారు విమానం కట్టారు.


శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళుకు ప్రముఖస్థానం. ఆమెను గోదాదేవి అని అంటారు. మధురలో మీనాక్షికే ప్రాధాన్యం. సుందరేశ్వరునికి ద్వితీయస్థానం. నమ్మాళ్వార్ జన్మస్థలం కురుకూరు. ఆయన గౌరవార్ధం దానిని ఇప్పుడు 'ఆళ్వార్ తిరునగరి' అని పిలుస్తున్నారు. ఆయనకూ విశేష ఉత్సవాలు చేస్తుంటారు. వైష్ణవ సాంప్రదాయాచార్యులలో నాదముని, ఆలవిందార్, మనక్కాల్, నంబి, తిరుక్కాచ్చినంబి, కూరత్తాళ్వార్, భట్టర్, నాచ్చియార్ ముఖ్యులు. ఆలయాలలో వీరి సన్నిధిలో పూజలు, ఉత్సవములు జరుగుతూ ఉంటాయి. శివాలయాలలో నాయన్మారులకు ఇంత ప్రాముఖ్యం ఇవ్వటం లేదు.


ఇంతకూ చెప్పవచ్చినదేమిటంటే వైష్ణవ సాంప్రదాయములో ఆచార్యభక్తి అధికమని, రామానుజుల శిష్యులు వారికి అతివేలంగా భక్తిని నెరపేవారు. ఆయనకోసం ప్రాణత్యాగం చేయడానికైనా వెనుదీసేవారు కాదు. అట్టివారిలో కూరత్తాళ్వార్ ఒకరు. వారి గ్రామం కంచికి సమీపంలో ఉన్న 'కూరం'.


రామానుజుల కాలంలో ఉన్న చోళరాజు పరమశైవుడు. రామానుజులు విష్ణ్వాధిక్యమును బోధించే ఆచార్యులు. చోళుల రాజధాని గంగైకొండచోళ పురం. రామానుజులు శ్రీరంగంలో ఉన్నారు.  రాజు రామానుజులను తమ సిద్ధాంతాన్ని గూర్చి చర్చ చేయడానికి ఆహ్వానించారు. కూరత్తాళ్వారు పరమశైవుడైన చోళరాజు తన గురువుకు ఏమి అపకారం చేస్తాడో అని భయం వేసింది. అందులో ఆ కాలపు రాజులు నిరంకుశులు.


కూరత్తాళ్వార్ రామానుజుల వేషంలో రాజువద్దకు వెళ్ళాలని నిశ్చయించారు. రామానుజులు ధరించే కాషాయాలను శిష్యుడు ధరించాడు. రామానుజులు శ్వేత వస్త్ర ధారియై కర్ణాటక దేశంలోని తిరునారాయణపురం వెళ్ళారు. ఈ సంభవాన్ని స్మరిస్తూ ఇప్పటికీ 'వెళ్ళైచ్చాత్తుపడి' (తెల్లని వస్త్రములు ధరించుట) అనే ఉత్సవం చేస్తారు.


చోళరాజు సమక్షంలో కూరత్తాళ్వార్ శివాధిక్యాన్ని ఒప్పుకోలేదు. రాజు ఉగ్రుడై కూరత్తాళ్వార్ కండ్లను పీకించాడు. కూరత్తాళ్వార్ సంతోషంగా శిక్షను అనుభవించాడు. చోళరాజు మరణానంతరం రామానుజులు తమిళ దేశానికి మరలివచ్చారు. శిష్యుని దురవస్థకు ఎంతో చింతించారు. రామానుజులు మొదట కంచిలో వరదరాజస్వామిని సేవించేవారు. శ్రీరంగంలో ఉన్నప్పుడు రంగనాథస్వామిని సేవించారు. కానీ వరదరాజులు అంటే వారికి విశేషానురాగం. నీవు నీ దృష్టి కోసం వరదరాజును ప్రార్ధించు అని కూరత్తాళ్వార్
తో చెప్పారు. కూరత్తాళ్వార్ భగవద్దర్శనం కావాలంటే ఇంద్రియాలు నిగ్రహించాలి. రాజు పుణ్యమా అని కండ్లు పోయి, ఇంద్రియాలలో ఒక ఇంద్రియ నిగ్రహం స్వతఃసిద్ధమైనది. దృష్టి మరలా మరలా వస్తే ఈ ప్రపంచములో చూడడానికి ఏముంది? కానీ మీ ఆజ్ఞ జవదాటరాదు. మీరు చెప్పినట్లు చేస్తాను. వరదరాజు నాకు మళ్ళీ కళ్ళు ఇవ్వనీ, కానీ నా గురువులైన మిమ్మల్నీ, వరదుణ్ణీ చూడగలగితే చాలు. ఆ కండ్లకు ఇతర విషయాలు గోచరం కారాదు' అన్నాడట. ఆయన కోరినట్లే వరదరాజు ఆయనకి వరదానం చేశాడు.

రామానుజులకు పూర్వమున్నవారు ఆళవందార్. వారికి కర్మ శేషమున్నందువలన పరమ ప్రాప్తికి ఆలస్యమైనది. ఆ కర్మ శేషాన్ని తాను అనుభవిస్తానని ఒక శిష్యుడు ప్రార్ధించాడు. ఆళవందార్ తరఫున ఆ శిష్యుడు రాచపుండుతో బాధపడి గురువు యొక్క కర్మ శేషాన్ని తొలగించాడు.

ఈ గురుపరంపర కథలలో ఒకటి - కొంచెం హాస్యంగానే ఉంటుంది.

రామానుజులకు వడుకనంబి అని శిష్యుడొకడు ఉండే వాడు. ఇంట్లో అతను గురువు కోసం పాలను వేడి చేస్తూ ఉన్నాడు. వీధిలో రంగనాథస్వామి ఉత్సవ మూర్తి వెళుతూ ఉంది. 'స్వామిని దర్శించు' అని రామానుజులు శిష్యుని కేకవేశారు. శిష్యుడు వినిపించుకోలేదు. రామానుజులు శిష్యుణ్ణి దర్శనం ఎందుకు చేయలేదు అని మందలించారు. శిష్యుడన్నాడట.."మీ పెరుమాళ్లకు చేస్తున్న ఈ క్షీరసేవ మధ్యలో వదిలి వెళ్లడం భావ్యమా??" అని.

గురుభక్తి ఉండే శిష్యుడు గురుసేవలో సంతోషంగా ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాడు. పరశురాముడు శత్రువులకు విరోధి. కర్ణుడు అతని వద్ద ధనుర్వేదం నేర్చుకోవాలని బ్రాహ్మణ వేషంలో వస్తాడు. పరశురాముడు ఒకరోజు కర్ణుడి తొడపై తలపెట్టుకుని నిద్రపోతూఉండగా, ఒక కీటకం కర్ణుడి తొడ క్రింద చేరి తొలచనారంభించింది. గురువుకు నిద్రాభంగం అవుతుందని కర్ణుడు కదలక మెదలక కూర్చున్నాడు. అమితంగా రక్తస్రావం అయినది. పరశురాముడు నిద్ర నుండి లేచి కర్ణుడు బ్రాహ్మణవేషధారి కానీ, బ్రాహ్మణుడు కాదని తెలుసుకుంటాడు. మిగతా కథ మీకు తెలుసు.

ఆళ్వారులలో మధుర కవి ఒకరు. ఆయన 11 పాశురములు వ్రాశారు. వానిని నాలాయిర ప్రబంధంలో చేర్చారు. (నాలుగువేల స్తోత్రములు కల గ్రంధం). పాశురములు విష్ణుపరముగా ఉన్ననూ, మధురకవి వ్రాసిన పాశురములు నమ్మాళ్వారు గురించి చేసిన స్తోత్రములు. నమ్మాళ్వార్ కు 'ప్రపన్నజనకూటస్థుడు' అని బిరుదు ఉండేది.

మధురకవి బ్రాహ్మణుడు. నమ్మాళ్వార్ బ్రాహ్మణేతరుడు. మధురకవి ఉత్తరదేశంలో పర్యటిస్తున్నప్పుడు, దక్షిణభాగం నుంచి ప్రసరిస్తున్న ఒక కాంతి పుంజాన్ని చూశాడు. ఆ వెలుగును అనుసంధానంచేస్తూ వేయిమైళ్ళు దక్షిణదిశగా పయనం అయి వెళ్ళాడు. తిరుక్కరుకురై (ఆళ్వార్ తిరునగరి) చేరి అక్కడ ఒక గుహలో నుండి కిరణములు వెలువడుతున్నవి అని కనిపెట్టాడు. మధురకవి వెళ్ళి చూడగా ఆ గుహలో నమ్మాళ్వార్ ధ్యాననిష్టలో ఉన్నారు.

ధ్యానానంతరము, మధురకవి సంజ్ఞల మూలముగా ఆత్మతత్త్వము గురించి అడిగాడు. నమ్మాళ్వార్ కూడా సైగలతోనే సమాధానమిచ్చారు. అదే మధురకవికి మంత్రోపదేశం ఇచ్చినట్లైనది. "నమ్మాళ్వార్ పెరుమాళ్ళను గురించి స్తోత్రం చేస్తాను" అని పదకొండు పాశురములు వ్రాశారు. ఈ గురుభక్తి చాటే మధురకవి పాశురములను, పెరుమాళ్ల స్తోత్ర గ్రంధమైన "నాలాయిరము" లో చేర్చినారు. రామానుజులు తప్పించి తనకు వేరే దేవుడు లేరని వేదాంతదేశికులూ తమ గురుభక్తిని వ్యక్తం చేశారు.

15. శిక్కులలో గురుభక్తి

ఆచార్యుడు ఉన్నచో దైవం వేరే అక్కరలేదు. దేవుడు కూడా గురువుకి సమానం కాదు అని దాదాపు అన్ని సంప్రదాయములూ చెబుతాయి. శిక్కులు గురువు ఉంటే శిష్యుడు ఉండాలనీ, శిష్యుడు ఉంటే శిక్ష ఉండాలనీ అభిప్రాయపడతారు.

గురుగోవింద్ సింగ్ ఖాల్సాని స్థాపించినప్పుడు నరబలి ఇవ్వడానికి సభ్యులలో ఒకరిని ముందుకు రమ్మని అర్ధించారు. శిష్యుడొకడు ముందుకు వచ్చాడు. వానిని లోనికి తీసుకునిపోయి కొంతసేపటికి రక్తసిక్తమైన కత్తితో వచ్చి ఇంకొకరిని రమ్మన్నారు. ఈ విధంగా ఐదు మార్లు లోపలికి తీసుకువెళ్ళి, ఐదుమార్లూ రక్తసిక్తమైన హస్తములతో బయటికి వచ్చారు గురుగోవింద్. పిదప ఆ ఐదుగురినీ బయటపెట్టి, మీ భక్తిని పరీక్షించడానికే ఈ పన్నాగం అని వివరించారు. నిజంగా ఆ ఐదుగురిని ఆయన చంపలేదు. ఆ రక్తం ఏదో గొర్రె రక్తం. ప్రాణత్యాగానికి సమ్మతించిన ఆ ఐదుగురినీ ఖాల్సాలో ముఖ్య సభ్యులుగా ఎన్నుకొన్నాడు.

గురుభక్తి సంపూర్ణముగా ఉన్న శిష్యునికి గురువు లక్షణములు స్వయంగా వరిస్తాయి. శిష్యులు మహాత్ములై స్వయంగా గురువులైన తర్వాత కూడా శిష్యరికం భజిస్తూ వారి గురువులను ఆరాధించడం మన సాంప్రదాయం.



(సశేషం .....)

సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.
-- SRI MOHAN KISHOR NEMMALURI

ఆదిశంకరుల గురుభక్తి

 "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు

11. ఆదిశంకరుల గురుభక్తి

'ఆచార్య' అనే పదం చెవిలో పడితే చాలు, మనకి జ్ఞాపకానికి వచ్చేది శంకరాచార్యులే. ఆయన తన గురువు గోవింద భగవత్పాదాచార్యులను, వారి గురువైన గౌడపాదాచార్యులను దక్షిణామూర్తి స్వరూపంలో చూసి దక్షిణామూర్తి స్తోత్రాన్ని నమస్కారక్రియగా వ్రాశారు. శంకరులవారే స్వయంగా దక్షిణామూర్తి అవతారము. కానీ వారు వ్రాసిన దక్షిణామూర్తి స్తోత్రంలో, ప్రతీ శ్లోకంలోనూ, "తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే" అన్న వాక్యం నాలుగవ పాదంలో జోడించి నమస్కరిస్తున్నారు.

తమ గురుభక్తిని ఒక శ్లోకంలో శంకరులు ఈ విధంగా వ్యక్తం చేశారు.

"ఈ మూడు లోకాలలోనూ జ్ఞానదాతయైన సద్గురువుతో పోల్చదగిన వస్తువు లేదు. వరుసవేది అయః పిండాన్ని బంగారంగా మార్చగలదు. కానీ రాతిని మరొక వరుసవేదిగా అది రూపొందించలేదు.

గురువు అనగా తనను ఆశ్రయించిన వారిని తనంతటి వానిగా చేయగలడు. అందుచేత గురువుకు సాటి ఎవరూ లేరు."

కాశీలో పరమేశ్వరుడే ఛండాల రూపంలో శంకరుల ముందు నిలిచినపుడు, "ఛండాలోస్తు సతుద్విజోస్తు గురురాత్యేషామనీషామఘ" ఆత్మజ్ఞాని ఛండాలుడైనా సరే, నాకు గురువే - ఉద్ఘాటించారు. తానే జగదాచార్యులు అయినప్పటికీ, అందరి సమక్షంలో ఈ విధంగా వినయంగా చెప్పుకున్నారు.

12. రామానుజాచార్యుల వారి గురుభక్తి
రామానుజులు తన గురువు యొక్క ఆదేశమునకు విరుద్ధంగా తనకు ఉపదేశించిన మంత్రాన్ని అందరికీ ఉపదేశించారు. (ఆయన గురువు తిరుకోటియూర్ నంబి). కానీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆ గురువు గారికి రామానుజులు వినమ్రుడై ఉండినారు. ఆయన గురువు ఉపదేశం ఇవ్వడానికి పూర్వము, రామానుజులను 18 మార్లు శ్రీరంగం నుండి తిరుకొట్టియూరుకు వచ్చిపొమ్మన్నారు. కానీ రామానుజులు ఏ విధమైన అనిఛ్చకానీ, అఔకర్యం కానీ గురువుకు వ్యక్తం చేయలేదు.

గురువుకు స్మార్తులు నాలుగు సార్లు సాష్ఠాంగ నమస్కారము చేస్తారు. వైష్ణవులు 'గురువు చాలు' అని చెప్పేంతవరకు నమస్కారాలు చేస్తూనే ఉంటారు. ఒకమారు తిరుకోటి నంబి నదిలో స్నానం చేస్తున్నారు. నదీతీరంలోని ఇసుక సూర్యరశ్మికి వేడిగా ఉంది. ఉష్ణం అసహనంగా ఉన్నా రామానుజులు లెక్కచేయక మండే ఇసుకలో తిరుకోటినంబికి నమస్కారాలు చేస్తూనే వున్నారట. శిష్యుని కష్టం చూసి గురువు ఇక చాలు అని నమస్కారాలు నిలిపారట.

13. శంకరుని శిష్యులు
భగవత్పాదుల శిష్యులు స్వయంగా మహాత్ములు. కానీ వారి గురుభక్తి అసమానము.  శంకరుల శిష్యులలో తోటకాచార్యులు - భవ ఏవభవాన్ - నీవు స్వయంగా భవుడవే (శివుడవే), నీవు వృషధ్వజుడివి అని తోటకాష్టకంలో స్తుతి చేశారు.

ఒకప్పుడు వ్యాసుల వారు శంకరులను పరీక్షింపదలిచి వృద్ధ వేషంలో బ్రహ్మసూత్రభాష్యంపై వాదానికి వచ్చారు. అపుడు వారి సమక్షంలో పద్మపాదాచార్యుల వారున్నారు. వారి వాదం అతి తీవ్ర స్థితిలో ఉన్నప్పుడు - 'శంకరః శంకర స్సాక్షాత్ వ్యాసో నారాయణ స్వయం' - అని పద్మపాదులు తమ గురువును హెచ్చరించారు.

పిదప పద్మపాదులు శంకరభాష్యంపై ఒక విసృతిని రచించారు. దానిని పంచపాదిక అని అంటారు. అందులో శంకరులు వారు 'అపూర్వ శంకరులు' అని పిలిచి తమ గురుభక్తిని వెల్లడి చేశారు.

పద్మపాదుల అసలు పేరు సనందుడు. ఆయనది చోళదేశం. వారు కాశీలో ఆదిశంకరులకు 16 ఏళ్ళు నిండక ముందే శిష్యులయ్యారు. భాష్యములన్నీ అప్పటికే శంకరులు పూర్తి చేసి జీవితాన్ని చాలించాలని అనుకున్నారు. ఆ సమయంలోనే వ్యాసుల వారు శంకరులతో భాష్యసంవాదం చేసి, మెచ్చుకొని వారికి మరొక 16 ఏళ్ళు ఆయుర్దానం చేసి, 'భాష్యాలు వ్రాసినంత మాత్రాన ప్రయోజనం లేదు, పండితులతో చర్చ చేసి అద్వైత సిద్ధాంతాన్ని స్థిరీకరణ చేయడానికి, దేశమంతటా సిద్ధాంతం వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేయాలని అన్నారు. ఆ కథ అట్లా ఉండనీయండి.

శంకరులు కాశీలో ఉన్నప్పుడు గంగలో స్నానం చేస్తున్నారు. గంగకు ఆవలి తీరంలో పద్మపాదులు ధౌతవస్ర్తాలను ఎండపెడుతున్నారు. పద్మపాదుల గురుభక్తిని లోకానికి చాటుట కొఱకు శంకరులు ఎండిన మడి బట్టలను తెమ్మన్నారు. మధ్యలో నది ఉన్నదన్న సంగతి కూడా సనందుడు మరిచిపోయాడు.

నీళ్లలో నడుస్తూ ఉంటే గంగాదేవి ఆయన మునగకుండా పాదముల క్రింద తామర పుష్పములను ప్రభవింపజేసింది. తాను నడుస్తుంటే తన పాదముల క్రింద పద్మములు విచిత్రంగా వస్తున్నవన్నదీ, శంకరులు నీవు గంగను ఎట్లా దాటావు అని అడిగేంతవరకూ ఆయనకి దేహస్ఫురణ లేదు.

మీ స్మరణ మాత్రాన ఈ సంసారార్ణవం జానుధగ్ధమౌవుతుంది. (మోకాలి లోతు) గంగను తరించడం ఒక లెక్కయా?? అని సనందనుడు బదులు చెప్పారట. అప్పటి నుంచీ వారికి పద్మపాదులన్న పేరు స్థిరమయింది. ఈశ్వరావతారమైన భగవత్పాదుల వారి శిష్యుడు పద్మపాదులవటం సమంజసంగానే ఉంది.

(సశేషం .....)


సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.
-- SRI MOHAN KISHOR NEMMALURI

ఆచార్యుడే ఈశ్వరుడు

 "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు

8.ఆచార్యుడే ఈశ్వరుడు
ఆచార్య పురుషులకు బంధము లేదు. వారు స్వతంత్రులు, నిత్యముక్తులు. మనకు నియమబద్ధ జీవనాన్ని చూపుటకొరకే వారు ఆచార్యులుగా వ్యవహరిస్తున్నారు. అట్టివారి సేవ శీఘ్రఫలదం. ఈశ్వరుడే ఆచార్యుని రూపములో మనకి జ్ఞాన దానం చేస్తున్నాడు. 'ఈశావాస్యమిదం సర్వం' అన్నారు. సర్వమూ ఈశ్వరుడే, అప్పుడు గురువులోనూ ఆచార్యునిలోనూ ఉన్నాడంటే అభ్యంతరమేమి?

అట్లా అయితే మనం ఎవరం? మనమూ ఈశ్వరులమే కదా. మరొకరిని ఆచార్యుడనీ, ఈశ్వరుడనీ మనమెందుకు ఆరాధించాలి?

అన్నీ అతడే. కానీ మన ఈశ్వరత్వాన్ని మనం స్వయంగా గుర్తించలేకున్నాము. కించిత్తైనా మన ఈశ్వరత్వాన్ని మనం గుర్తించగలిగితే ఈ కామక్రోధాలు, ఆశాపాశాలు, దుఃఖం, కష్టం, పాపం ఉంటాయా?? మనం ఈశ్వరులం అన్న జ్ఞానం లేక అలమటిస్తున్నాము. కానీ ఆచార్యునికి తన ఈశ్వరత్వం తెలుసు. ఆయనకు మనకున్న సుఖ దుఃఖాలు లేవు. అతడు ద్వంద్వాలకు అతీతుడు. మనలో చూడలేని ఈశ్వరత్వాన్ని అతనిలో మనం చూడగలుగుతున్నాము. ఈ సత్యాన్ని మనం తెలుసుకుని మనం ఆచార్యుని సేవ చేశామంటే, ఆయన మన అజ్ఞానమనే తెరని తొలగించి, మనలో సత్యప్రతిష్ట చేయగలడు.

అందుకని పరమార్ధ ప్రయోజనం కోసం ఆచార్యుని ఇప్పుడే ఇక్కడే ఈశ్వరునిగా భావించి విధేయులమై ఆయన అనుగ్రహం చేసిన ఉపదేశానుసారం జీవితాలను నడుపుకోవాలి.

9. స్వధర్మాన్ని పాటించండి
మన పూర్వ కర్మానుసారం ఈశ్వరుడు జన్మను విధిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈశ్వరుడు మనల్ని ఏ మతంలో, ఏ శాఖలో, ఏ సాంప్రదాయంలో పుట్టించాడో తదనుసారం జీవితం గడుపుతూ కర్మక్షాళనం చేసుకుని పురుషార్ధాన్ని సాధించాలి. మన శాఖకో, జాతికో ఏర్పడిన ఆచార్యోపదేశం అనుసరించితే చాలు. ఆ సిద్ధాంతాలు అసంపూర్ణమైననూ పర్వాలేదు.

కర్మశేషం ఉండడం వలన జీవునికి పూర్ణత్వం అవగతమవడం లేదు. కానీ ఏ మతంలో పుట్టామో ఆ మతం అసంపూర్ణమైనా, పూర్ణ కర్మ క్షయానికి అది సహాయ పడుతుంది. ఎవనికి అనన్య భక్తి ఉన్నదో, తన్ను పూర్తిగా భగవంతునికి అర్పణ చేసుకుంటున్నాడో వానికి ఈశ్వరుడు ఎన్నడూ ప్రణష్టుడు కాదు. ఈశ్వరానుగ్రహం అతనికి అన్ని కాలములలోనూ ఉంటుంది. "ఈ జీవితాన్ని నీవు నాకు ప్రసాదించావు. నేను నా సాంప్రదాయాచార్యుని పాదములు నమ్ముకున్నాను" అని ఎవడైతే తన కులధర్మాన్ని అస్ఖలిత శ్రద్ధతో పాటిస్తున్నాడో, వానికి ఈశ్వరుడు పరిపూర్ణత అనుగ్రహిస్తాడు.

మన ఆచార్యుడే ఈశ్వరుడు అన్న విశ్వాసం మనకి ఉండాలి. గురువుకి స్వాత్మార్పణ చేసుకుంటే అది ఈశ్వరార్పణే. గురువు వద్ద చేసే ప్రపత్తి అది ఈశ్వర ప్రపత్తియే. ఈ విషయం ఉపనిషత్తులను పారాయణ చేసేటప్పుడు చెప్పే శాంతి పాఠంలో ఉంది.

యో బ్రహ్మాణం విదధాతి పూర్వం
యోవై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై
తంహదేవం ఆత్మ బుద్ధి ప్రకాశం
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే II


"ఎవడు బ్రహ్మను పూర్వం సృష్టించాడో, వేదములను అతనికి అనుగ్రహించాడో, ఆ ప్రకాశరూపుని, బుద్ధిప్రేరకుని మోక్షార్ధం శరణు చెందుతున్నాను".

ఒక సాంప్రదాయాన్ని అనుసరించక స్వబుద్ధిపై ఆధారపడేవానికి అనర్ధమే కలుగుతుంది. అట్టివారు చేసే హాని మూర్ఖులు చేసే హాని కంటే అధికం. ఒక సాంప్రదాయాన్ని అనుసరించని వాడు మూర్ఖుడని శంకర భగవత్పాదులు ఉపదేశ సాహస్రిలో చెప్పారు. జ్ఞానలాభానికి గురుభక్తి అవసరం. పుస్తకాలు చదివినంత మాత్రాన జ్ఞానం కలుగుతుందన్న నిశ్చయం లేదు.

10. దేవతలే శిష్యులుగా ఉండడం
మనందరమూ సాంప్రదాయాన్ని వదలరాదు. సంప్రదాయ ఆచార్యుల యందు భక్తిని కలిగి ఉండాలి. గురువుల అడుగుజాడలలో మనం నడవాలి. మన ఆచార్యులందరూ పరమ గురుభక్తులే.

మనకు మొదటి గురువు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి పరమేశ్వరుడే. ఆయనకూడా ఒక గురువుని వరించి ఉపదేశం పొందవలసి వచ్చింది. ఆయన తనపుత్రుని వద్ద వినయవిధేయతలతో ప్రణవం ఉపదేశం పొందాడు.

జ్ఞాన స్వరూపమే అంబిక (అమ్మవారు). ఆమె కూడా తన భర్త ఈశ్వరుని వద్ద శిష్యరికం చేసింది. ఆమెకు ఈశ్వరుడు ఆగమములను, తంత్రములనూ ఉపదేశించాడు. అంతేకాదు ఆమెకు క్రింది తారక మంత్రాన్ని కూడా ఉపదేశించాడు.

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే II

మూరు మార్లు రామ నామం చేస్తే అది వేయి విష్ణు నామాలు చేసినంత పుణ్యం.

ఈశ్వరుడు అంబికకి ఉపదేశించాడు అన్న విషయం ఎన్నో స్థలపురాణాలలోనూ ఉన్నది. మహావిష్ణువు రామకృష్ణాది అవతారములలో గురుకుల వాసం చేశాడు. రాముడు వశిష్ఠుని వద్ద, కృష్ణుడు సాందీపమహర్షి వద్ద గురుకుల వాసం చేశారు. కృష్ణుడు తన సహాధ్యాయి అయిన సుధామునితో వానలో, తుఫానులో వంట చెఱకు కోసం వెళ్ళాడు. చిత్రకూటంలో భరతునితో పాటు వశిష్టుడు వచ్చి రాముని తిరిగి అయోధ్యకి రమ్మని కోరినప్పుడు, ఆయన గురువు యొక్క సమ్మతితో, అయోధ్యకి మరలి వచ్చుటకు నిరాకరించాడు. ఈ నిరాకరన కూడా వినయపూర్వకముగానే చేశాడు.

గురుపరంపరలో దత్తాత్రేయస్వామికి ఒక విశిష్ట స్థానమున్నది. భాగవతంలో ఆయన తనకు 24 గురువులు ఉన్నట్లు చెప్పాడు. భూమి, నీళ్ళు, కొండచిలువ, కందిరీగ, వేశ్య, వేటగాడు, శిశువు - వీళ్లంతా ఆయనకి గురువులు అన్నాడు. ఒక్కక్కరి వద్దా ఒక్కో పాఠం తాను నేర్చుకున్నట్లు ఆయన వివరంగా చెప్పుకున్నాడు.



(సశేషం ......)

సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.
-- SRI MOHAN KISHOR NEMMALURI

పూర్ణత్వమునకు ఎన్నో మార్గములు

 "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు

6. పూర్ణత్వమునకు ఎన్నో మార్గములు
దీక్షలు పలు రకములు. దీక్షా మార్గములు ఎన్నో ఉన్నా, గమ్యం ఒక్కటే. ఒకే గురువు తన శిష్యులలో ఒక్కొక్కరికీ ఒక్కో మార్గం నిర్దేశించవచ్చు. కానీ ఆచార్యుడు మాత్రం శిష్యులకు ఒకే సాంప్రదాయమును ఉపదేశిస్తాడు.

గురువులు శిష్యులను మంత్ర, తంత్ర, యోగాద్వైత మార్గములలో దేనిలోనైనా ప్రవేశపెట్టవచ్చును. తిరుమంత్రం అనే గ్రంధంలో తిరుమూలర్ అనే సిద్ధుడు వివిధ మార్గములను విశదీకరించి యోగ జ్ఞానములతో ముగింపు చేశాడు. తిరుమూలర్ తో ఒక గురుపరంపర ఆరంభమైనది. ఈ పరంపరలో సారమామునివర్ ఒకరు. ఆయన తిరుచినాపల్లిలో ఒక మఠాన్ని స్థాపించాడు. ఈ మఠానికి ఒక సమయంలో మౌనగురువు అనే ఆయన అధిపతిగా ఉండేవారు. తాయుమానివర్ కి ఈయనే గురువు. తాయుమానివర్ క్రీ.శ. 17వ శతాబ్దానికి చెందినవాడు. మౌనగురువు అనంతరం ఈ మఠం ధర్మపుర అధీనం కిందకు వచ్చింది.


దక్షిణామూర్తి స్వామి సనకాది మునులకు మౌనవ్యాఖ్యా రూపంగా జ్ఞానబోధ చేస్తున్నాడు. తాయుమానవర్ కూడా అన్నిమార్గాలు చిట్టచివర మౌనమార్గంలో లయిస్తాయని చెప్తున్నాడు.

మన నిజతత్త్వం మౌనమే. ఆ మౌనాన్ని మరచిపోలేని సంసారంలో పడుతున్నాము. సంసారం అంటే మాయ. అమ్మవారే మహామాయ. ఆ మహామాయయే జ్ఞానాంబికగా అవతరించి మన అజ్ఞానాన్ని పోగొడుతూ ఉంది. ఈ జ్ఞానబోధకే ఆమె గురుస్వరూపిణి అవుతున్నది. ఆ జగన్మాత మనకి జ్ఞానమనే క్షీరాన్ని ఇస్తున్నది. ఈ లోకంలో, చెట్టూ, చేమలూ, పక్షులూ, పండ్లూ, వివిధ వస్తుజాలమూ అంతా ఆమె సృష్టియే. ఎన్నో రంగులు, ఎన్నో వాసనలు, ఎన్నో రూపాలు మనుష్యులలో ఎన్నో మనోభావాలు. అంతా ఆ మహామాయ విలాసమే. ఆమెయే లిపి రూపంగానూ, భాషారూపముగానూ, శాస్త్రరూపముగానూ ఉన్నది. అన్నిటికి ఆవల మౌనం, మహామౌనం. మౌనగురువుగా ఆమె అవతరించి శిష్యునికి జ్ఞానబోధ చేస్తుంది. "ఏకంసత్" అని.

7. గురువూ ఆచార్యుడూ ఒక్కరే
మొత్తం మీద నేను చెప్పేది (అంటే పరమాచార్య స్వామి వారు..), మనకి జ్ఞానం దానం చేసే వారిని గురువు, ఆచార్యుడూ అని పిలుస్తున్నాము. మహత్త్వమున్నందున గురువు అని పేర్కొంటున్నాము. శ్రోత్రియుడూ, అనుష్టానపరుడూ, సంప్రదాయజ్ఞుడూ అయిన వానిని ఆచార్యుడు అంటున్నాము. ఆచార్యుడు సాంప్రదాయ మర్మములను మనకి తెలిపి మనలను అనుష్టాన పరులుగా చేస్తున్నాడు. గురువు తన మహత్వం చేతా, అనుగ్రహం చేతా మనకు జ్ఞానం దానం చేస్తున్నాడు. ఆచార్యుడు శాస్త్ర సాంప్రదాయాల మూలకముగా మనకు ఆచార అనుష్టానాలను తెలిపి జ్ఞానం పొందడానికి తోడ్పడుతున్నాడు.

ఈ విధంగా ఆచార్యునికీ, గురువుకీ కించిత్ భేదమున్నప్పటికీ, పాత్రత ఉన్న ఆచార్యుడు గురువు కూడా కాగలడు. ఆచార్యుడు ఒక సాంప్రదాయానికి చెంది తదనుసారులైన ఆచార అనుష్టానాలను బోధిస్తున్నా, తన వరకూ ఒక విధానానికి కట్టుబడక ఈశ్వరానుభవమూ, ఆత్మానుభవమూ పొంది ఉండినట్లైతే, అతడు అనుగ్రహదానం చేయగలడు. మన ఆచార్య పురుషులందరూ ఈ కోవకి చెందిన వారే.

ఆధ్యాత్మిక జీవనారంభంలో కొన్ని కట్టుబాట్లు ఉండవలసినదే. అపుడే మనసుకు ఒక నిలకడ ఏర్పడగలదు. అందులకు మన పెద్దలు యమ నియమాలు చెప్పారు. ఈ కట్టుబాట్లు ఉన్నంత వరకూ మనమందరమూ శిష్యులమే. నిర్భందముగా అనిపించే ఈ నియమాలు కొంత కాలానికి సహజమైపోతాయి. అతనికి నియమ పాలనం చేస్తున్నానని కూడా అనిపించదు. అపుడు అతడు ఇతరులను కూడా ఆ మార్గములో ప్రవేశపెట్టగలడు. అట్టివాడు చేసే ఉపదేశాలు ఇతరులని గాఢంగా ప్రభావితులను చేయగలవు.

ఆచార్యుల స్థానంలో వచ్చిన ఈకాలం గురువులకు విద్వత్తు ఉంటే చాలు, ఆచార అనుష్టానాలు వారికి అక్కర్లేదు. పూర్వకాలంలో విద్వత్తు,
ఆచార అనుష్టానాలున్నవారినే ఆచార్యుడు అని పిలిచేవారు. అనుష్టానము అంగమే కానీ లక్ష్యం కాదు. అనుష్టానం అనుభూతిలో ముగియాలి. అట్టి అనుభూతి పరునకు ఆచారం స్వాభావికమైపోతుంది.

అనుష్టానము ఉన్నప్పుడే విద్యకు పూర్ణత. అనుష్టానానికి పూర్ణత్వం అనుభూతియే. అనుభూతి కలవాడే గురువనీ, అనుష్టానపరుడు మాత్రమే ఆచార్యుడనీ చెబితే అదీ సరికాదు. నిజమైన ఆచార్యునికి ఆచరమూ, అనుష్టానము రెండూ ఉంటాయి. బాహ్య జీవనం అనుష్టాన బద్ధముగా ఉంటూ, ఆంతరంగికముగా అతడు ఏ కట్టుబాటూ లేక కైవల్యంలో ఉంటాడు. అట్టివాడే మార్గదర్శకముగా ఉండగలడు. అతడు ఆంతరంగ మౌనం భజిస్తూ, బయత ఉపదేశ, ఉపన్యాస కార్యావళిలో మగ్నుడై ఉంటాడు.

గురువు-ఆచార్యుడు ఇద్దరూ ఒక్కటే. ఆదికాలం నుంచి వీనిని పర్యాయపదాలుగానే వాడుతున్నారు. ఉపనిషత్తులు వేదశిఖరములు. వానిలో పూర్తిగా ఆచార్య పదప్రయోగమే చేయబడినది.  ఆచార్య దేవోభవ అనీ, ఆచార్యునికి అతను కోరిన దక్షిన ఇవ్వవలెననీ, ఆచార్యవాన్ పురుషోవేదా - ఆచార్యుడున్న వాడే జ్ఞాని కాగలడు అనీ ఉపనిషత్తులు చెబుతున్నవి. అయినప్పటికీ ఆచార్యునితో సహవాసం చేస్తూ విద్యాభ్యాసం చేసే విధానాన్ని గురుకులవాసమని అన్నారు కానీ ఆచార్యవాసమని అనలేదు. ఆచార్యుని కృతజ్ఞతా పూర్వకముగా ఆరాధించే దినమును గురుపౌర్ణమి అన్నారు. వ్యాసాచార్యులు, శుకాచార్యులు, గౌడపాదాచార్యులు, గోవిందభగవత్పాదాచార్యులు, సురేశ్వరాచార్యులు, తోటకాచార్యులు వీరినందరినీ చేర్చి 'గురుపరంపర' అని వ్యవహరిస్తున్నాము. వారిని ఆచార్య పరంపర అని అనడం లేదు. ఇదే విధంగా రామానుజ, వల్లభాచార్య, మధ్వాచార్య సాంప్రదాయములలో కూడా గురువందనమనే అంటారు.

శైవ సిద్ధాంతాన్ని పాటించే గురువులను కూడా ఆచార్యులనే అంటారు. మైకండాచార్య, సంతనాచార్య మొదలైనవారు శైవసిద్ధాంతానికి చెందిన వారు. గురువులు సిద్ధిపొందినదినము తమ గురుస్మారకముగా ఆరాధన చేస్తారు. అదే గురుపూజ అంటారు.

(సశేషం ......)



సర్వం శ్రీగురు చరణారవిందార్పణమస్తు.
-- SRI MOHAN KISHOR NEMMALURI

అంబికానుగ్రమే దీక్ష

 "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు

5. అంబికానుగ్రమే దీక్ష
సచ్చిదానందమని మనం చెబుతూ ఉంటాము. చిత్ అనే పదానికి జ్ఞానం అని అర్ధం. అంబికయే జ్ఞాన స్వరూపిణి. లలితాసహస్ర నామాలలో చిదేకరసరూపిణి అని ఒక నామం ఉన్నది. ఏకరసము చిత్తే. శ్రీకాళహస్తిలో అమ్మవారిని జ్ఞానప్రసూనాంబ అని అంటారు.

గురురూపములో వచ్చి మనల్ని అనుగ్రహించేది అంబికయే. కాళిదాసు "దేశిక రూపేణ దర్శితభ్యుదయాం" అని అమ్మవారిని కీర్తించారు. దేశికుడంటే గురువే. వైష్ణవ సాంప్రదాయ ఆచారములో వేదాంతదేశికులొకరు. భగవత్పాదుల శిష్యుడు తోటకాచార్యులు ఆయన చేసిన తోటకాష్టకంలో 'శంకర దేశికమే శరణం' అని ప్రార్ధించారు. దేశికుడంటే అన్ని ప్రదేశాలను ఎరిగిన వాడు, శాస్త్ర నిష్ణాత. దేశికుని రూపములో అంబ అవతరించి శిష్యుణ్ణి స్పర్శ, నయన, స్మరణ దీక్షలతో అనుగ్రహిస్తున్నది.

స్పర్సదీక్షను కుక్కుటదీక్ష అనీ, నయనదీక్షను మత్స్య దీక్ష అనీ, స్మరణదీక్షని కమఠ దీక్ష అనీ అంటారు.

గురువు అనుగ్రహించిన దీక్ష ప్రతిభావంతమై ఉంటే, ఆ శిష్యుడు తన అర్ధరహితమైన జీవితానికి స్వస్తిచెప్పి పరమార్ధిక పథగాముడై పోతాడు. నిజానికి అది అతనికి ఒక పునర్జన్మ అనే అనాలి. అందులకే గాయత్రీ మంత్రోపదేశం చేత ఒకడు ద్విజుడౌతున్నాడు. ద్విజ అంటే రెండో పుట్టుక.

అంటే దీక్షకు ముందు ఒక జన్మ ఉండినదనీ, దీక్ష పిదప మరల అతను జన్మిస్తున్నాడనీ కాదు దీనర్ధం. దీక్షకు ముందుకూడా అతడు అంతరంగములో బ్రహ్మభేదముగా ఉండినప్పటికీ, అతనికి ఆ ఎరుక లేకపోవడం చేత, అతను అజ్ఞానము నందు ఉండినాడు. దీక్షా మూలముగా ఆ అజ్ఞానమనే పొర అతనిని వీడిపోయింది. ఒక కోడి గుడ్లు పెట్టి దానిపై కూర్చుని పొదిగినప్పుడు, గుడ్డును పగులగొట్టుకొని పొర నుండి బయటపడే కోడిపిల్ల వలే, శిష్యుడూ, గురువు అనుగ్రహించిన కుక్కుట దీక్షా మూలముగా (కుక్కుటం అంటే కోడి) అజ్ఞానం అనే అండాన్ని భేదించుకొని, జ్ఞాని ప్రపంచములో పడుతున్నాడు. తన నిజతత్త్వమేమో తెలుసుకుంటున్నాడు.

నీళ్లలో చేపలు గ్రుడ్లు పెడతాయి. ఆ గ్రుడ్లు నీళ్ళలో తేలుతూ ఉంటాయి. చేపలు ఆ గ్రుడ్లపై కూర్చుని పొదగడంలేదు. తేలుతూ ఉన్న ఆగుడ్లని అవి చూసినంత మాత్రాన, అవి చేపపిల్లలౌతాయని మన శాస్త్ర సాంప్రదాయం. అందుకే గురువు యొక్క వీక్షా దీక్షని మత్య్స దీక్ష అని అంటారు.

ఇక కమఠ దీక్ష సంగతి అంటే తాబేలు. తాబేలు గ్రుడ్లను ఇసుకలో పెట్టి మళ్ళా నీళ్లలోకి వెళ్ళిపోతుంది. ఆ గుడ్ల సమక్షంలో లేకపోయినా తాబేలుకు అదే ధ్యాస. ఆ పిల్లలు సుఖంగా గుడ్ల నుంచీ బయట పడతాయా లేదా అని విచారిస్తూనే ఉంటుంది. దాని స్మరణ బలం చేతనే గుడ్లు పొదగబడి తాబేలు పిల్లలు బయటకి వస్తాయి. అందుకే గురువు యొక్క స్మరణ దీక్షను కమఠ దీక్ష అని కూడా అంటారు.

అంబిక ఏ విధముగా దేశిక రూపములో ఈ మూడురకాలైన దీక్షలను మనకు అనుగ్రహిస్తున్నది??
అంబిక (అమ్మవారు) అక్షత్రయమని, కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అని మూడు రూపాలలో ఆవిర్భవించి ఉన్నది. ఆమె అనుగ్రహించేది స్పర్శ దీక్ష. భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో..

శృతీనాం మూర్ధానో దధతి తనయౌ శేఖరతయా
మమాస్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌః


"అమ్మా!! నీ పాదాలను ఆ శృతి శిరస్సులనబడే ఉపనిషుత్తులే తలదాల్చి ఉన్నవి. అట్టి నీ చరణములను నా శిరస్సుపై ఉంచి, నన్ను అనుగ్రహించు అని వేడుకుంటూన్నారు. ఉపనిషత్తులు వేదాంతాన్ని బోధిస్తాయి. శంకరుల జ్ఞాన మార్గము వేదాంత సాంప్రదాయమే.
జ్ఞానస్వరూపిణియే కామాక్షి. ఆమెను భగవత్పాదుల వారు స్పర్శ దీక్షకై ప్రార్ధిస్తున్నారు.

మదురలో మీనాక్షి అమ్మ ఉన్నది, ఆమె మీన నేత్ర. ఆమె మనకి అనుగ్రహించే దీక్ష నయన దీక్ష. ఆమె కటాక్షములే మనకు జ్ఞాన దీక్ష ఇస్తున్నది. ఇకపోతే కాశీలో విశాలాక్షి ఉన్నది, ఆమె సర్వకాలములలోనూ మనల్నే స్మరిస్తూ, స్మరణదీక్షా ప్రదానం చేస్తున్నది. ఆమె అనుగ్రహించేదే కమఠ దీక్ష.

ఈ విధంగా అంబిక మూడు రూపాలలో మూడు విధాలైన దీక్షలను అందరికీ అనుగ్రహిస్తూ పరతత్త్వజ్ఞానదానం చేస్తూఉన్నది.

(సశేషం ......)

గురుమూర్తే త్వాం నమామి కామాక్షీ!


సర్వం శ్రీగురు చరణారవిందార్పణమస్తు.
-- SRI MOHAN KISHOR NEMMALURI

దీక్ష

 "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు


దీక్ష
ఉపదేశమూలకముగా గురు-శిష్య సంబంధం ఏర్పడుతున్నదనే విషయం గురించి ఇంతవరకూ చెప్పాను. శాస్త్ర పరిభాషలో దీనినే "దీక్ష" అంటారు. తమిళంలో దీనిని "దీక్కై" అని చెబుతారు. ఉపదేశమూలకముగా గురువు నుంచి ఒక చైతన్యము శిష్యుడిలో ప్రవేశించి, తీవ్ర సంవేగాన్ని కల్పించి, ఆధ్యాత్మ మార్గములో ఒక అన్వేషణకి పురికొల్పేదే దీక్ష. ఈ చైతన్యం దీక్ష అయిపోయినంతనే అంతరించిపోవడం లేదు. ఈ చైతన్యము శిష్యునిలో ప్రవిష్టమై, అతనిని ఆధ్యాత్మంలో ఉన్నత లక్ష్యాలకు తీసుకువెళ్ళి, మంత్రసిద్ధి కలుగజేస్తున్నది.

గురువు ఒక్కమారైనా సరే, మంత్రోపదేశం చేసియో, కటాక్షమూలకముగానో, హస్తమస్తక స్పర్శనం చేతనో, అనుకంపన చేతనో గురుశిష్య సంబంధమైన దీక్షని ఇచ్చినట్లైతే, ఆ అనుగ్రహం శిష్యుని మీద ఎల్లకాలమూ ఉంటుంది. స్విచ్చిని నొక్కి ఉంచినంతసేపూ బల్బు వెలిగేట్లు ఈ అనుగ్రహం పనిచేస్తుంది. ఆచార్యుడు శిష్యుడిని సమక్షంలో ఉంచుకుని దీర్ఘ కాలం అతనికి విద్యను, అనుష్టాన విధానాలను బోధించాల్సి ఉంటుంది. గురువు విషయం అట్లా కాదు. అతనికి శిష్యునితో స్థూల సంబంధం అక్కర్లేదు. అతనికి ఒక్క క్షణం ఉంటే చాలు. కొన్ని సమయాలలో అదికూడా అక్కర్లేదు. అతని అనుగ్రహం దీక్షామూలకముగా ప్రసరించి, శిష్యుని సంసారాన్ని క్షణంలో భస్మం చేస్తుంది. శిష్యునికి సిద్ధి ప్రాప్తించేవరకు, గురువు అనుగ్రహం అన్నికాలాలలోనూ అతనితో ఉంటుంది.

దీక్ష ఇచ్చినవాడు గురువు. భారత, రామాయణాదులలో, పురాణాలలో తండ్రియే గురువని చెప్పబడినది. తండ్రి ఘనుడైనా సరే, కాకపోయినా సరే, మహాత్ముడైనా సరే కాకపోయినా సరే, తనయునికి అతను దైవసమానుడే. వేదాలు పితృదేవోభవ అని కూడా చెప్పినవి. తండ్రిని గురువుగా భావించడానికి మరో కారణం కూడా ఉంది. పుత్రునికి బ్రహ్మోపదేశ సమయంలో తండ్రియే కదా గాయత్రీ మంత్ర దీక్ష ఇస్తున్నది? తండ్రిని గురువుగా భావించడానికి ఈ ఆచారము కూడా కారణము.

ఇదే కాదు, అక్షరాభ్యాసకాలంలో, తండ్రి కుమారునికి "ఓమ్ నమో నారాయణాయ" అని అష్టాక్షరియో, "ఓం నమః శివాయ" అని పంచాక్షరీయో ఉపదేశం చేసే ఆచారం మనలో ఉంది. ఈ కారణంగా కూడా తండ్రి కుమారునికి గురువు అవుతున్నాడు. గురువు వద్ద శరణుజొచ్చిన శిష్యుడు శరణాగతి కారణంగా జ్ఞానలాభాన్ని పొందుతున్నాడు. ఈ జ్ఞానోపలబ్ధికి గురువు యొక్క లాఘవం కానీ, అనుభూతి రాహిత్యంకానీ అడ్డురాదు. శరణాగతి యొక్క మహాత్మ్యం అలాంటిది.

ఇలాంటి గురుభక్తి గురించి చెప్తున్నప్పుడు, కంచి మఠంలో జరిగిన ఒక ఉదంతం జ్ఞప్తికి వస్తున్నది. మఠ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు కుర్రవాళ్లని చూచి, మీ అధ్యాపకులు వచ్చారా అని నేను అడిగాను. ఒక బాలుడు ఇంకా రాలేదు అని బదులిచ్చాడు. రెండవ వాడు "ఆ! వచ్చారు" అని బదులు చెప్పాడు. నిజానికి అధ్యాపకుడు రాలేదు. రెండవ అబ్బాయితో ఎందుకు నీవు ఈ విషయములో అబద్ధము చెప్పావు అని నేను అడుగగా, "గురువు రానిదేమో నిజమే! ఆయన రాలేదంటే ఆయన లోపం చూపినట్లవుతుంది. అందుచేత నిజం చెప్పి గురువు యందు దోషం చూపేదాని కన్నా, అబద్ధం చెప్పి దోషాన్ని చూపకుండుట మంచిదని తోచి అట్లు చెప్పాను" అని అన్నాడు.

గురువు యోగ్యత ఎలాంటిదైనా సరే, శిష్యునికి అఖండమైన, అనన్యమైన భక్తి ఉంటే, అతనిని ఈశ్వరానుగ్రహం వెన్నంటియే ఉంటుంది.

మనం ఏ విషయాన్నైనా స్వయంగా నేర్చుకుంటే అది అహంకారానికి దారితీస్తుంది. ఏ విద్యకైనా ఒక గురువు అవసరం. మంత్రములు కూడా స్వయంగా గ్రహించినవి కాక, గురూపదేశములై ఉండవలె. గురువు లేకుండా తీసుకున్న మంత్రమో, చదివిన విద్యయో, "భార్యకు ఆమె ప్రియుడి చేత కలిగిన సంతానము వంటిది, అతనిని కుమారుడని పిలుచుకోవచ్చు, కానీ వైదిక కర్మలు చేయడానికి అతనికి అర్హత లేదు".

అందుచేత దీక్షకు గురువు అనివార్యము. వాగ్రూపక దీక్ష - మంత్రోపదేశము, కటాక్షముతో అనుగ్రహించే దీక్ష - నయనదీక్ష, శిష్యుని స్పర్శతో అనుగ్రహించేది స్పర్శ దీక్ష. భగవత్పాదులు - అంటే భగవంతుని పాదములు శిరసా గ్రహించి, ఆ పాదములే తాను అయినవాడు అని అర్ధం. అనగా మనం శంకర భగవత్పాదుల వారిని శిరసా ధరించాలి. గురువు ప్రత్యక్షోపదేశం ఇవ్వవలసిన అవసరం లేదు. ఎక్కడో దూరాన గురువు కూర్చుని శిష్యుని స్మరించినంత మాత్రాన, శిష్యునికి స్మరణ దీక్ష లభ్యమౌతున్నది.

(సశేషం ......)



సర్వం శ్రీగురు చరణారవిందార్పణమస్తు.
-- SRI MOHAN KISHOR NEMMALURI

గురువు - ప్రపంచము

 "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు

గురువు - ప్రపంచము
ఒక గురువు క్రమపద్ధతిలో బోధ చేయడానికి ఇష్టపడక పోవచ్చును. కానీ శిష్యులను ఆశీర్వదించాలని కోరుకోవచ్చును. ఇంకో మహాత్ముడు ఆశ్రితుల విషయంలో ఈ ఆశీర్వాద బాధ్యత కూడా మనకెందుకని ఊరుకోవచ్చును. అలాంటప్పుడు ఆ ఆశ్రితులను ఈశ్వరుడే రక్షిస్తాడు. వరప్రదానం చేస్తాడు. అనన్యంగా నమ్ముకున్న ఆ ఆశ్రితులకు దేవుని చేయూత ఎప్పుడూ ఉంటుంది.

అంధకారాన్ని పోగొట్టి జ్ఞానదీపాన్ని వెలిగించే ఏ సంభవమైనా ఉపదేశమే.

సాధారణంగా ఒక గురువే శిష్యుని మంత్రోపదేశం ద్వారా అనుగ్రహించి అతనికి శక్తిపాతం కలిగిస్తాడు. కొందరు మహాత్ములు శాస్త్రోపన్యాసములు ఇవ్వకపోయినా వారి శిష్యులకు మాత్రం మంత్రోపదేశం చేస్తారు. మనం ఎన్ని కథలు చదివి ఉన్నాం. ఒక మహాత్ముని ముందు ఒకడు ఎంతో కాలం పడిగాపులు కాస్తూ ఉంటాడు. ఒక్కరోజు హఠాత్తుగా ఆ మహాత్ముడు మంత్రోపదేశం చేస్తాడు. ఆ క్షణం నుంచీ అతనికి జ్ఞానోదయం కలుగుతుంది. గురుమూలకంగా మంత్రోపదేశం పొందాలని తపస్సు చేసిన శిష్యులూ, యుక్తి చాతుర్యం ప్రకటన చేసిన శిష్యులూ ఉన్నారు.

ఇక్కడ కబీరు కథ చెప్పాలి. రామానందులనే ఒక మహాత్ముని వద్ద కబీరు రామ మంత్రోపదేశం పొందాలని పరితపించేవాడు. కానీ అతడు ముస్లిము. అతడు హిందువే అనీ ముస్లిములచేత పెంచబడ్డాడనీ కొందరంటారు. రామానందులు తనకి మంత్రోపదేశం ఇవ్వరేమో అని అతనికి తోచింది. ఎట్లాగైనా ఆయన వద్ద మంత్రోపదేశం పొందాలని ఒక ఎత్తు వేశాడు. ఒకరోజు బ్రాహ్మీ ముహూర్తములో రామానందులు గంగా స్నానానికి వచ్చారు. కబీరు గంగా నది స్నాన ఘట్టంలో మెట్లమీద పడుకొని ఉన్నాడు. చీకటిగా ఉన్నందున రామానందుల వారు పడుకుని ఉన్న కబీరు మీద పాదములు మోపారు. కబీరు దానినే 'పాదదీక్ష'గా స్వీకరించాడు. (దీక్ష గురించి తర్వాత చెబుతాను..) ఎవరినో త్రొక్కినట్లు తోచగానే ఆయన రామరామ అని పాదాఘాతానికి ప్రాయశ్చిత్తముగా గట్టిగా ఉఛ్చరించారు. కబీరుకు అదే ఉపదేశమైనది. తారకమంత్రాన్ని ఏ విధంగానైనా రామానందుల వారి నుండి పొందాలని కబీరు ఈ పన్నాగం పన్నినాడు.

ఇంతకూ ఈ కథ ఎందుకు చెప్పానంటే రామానందుల వారు ఉద్దేశ పూర్వకముగా కబీరుకు మంత్రోపదేశము చేయలేదు. కానీ ఆయన రామరామ అనగానే, శిష్యుని సంకల్పం వలన, వారి అనుద్దేశపూర్వకమైన ఉఛ్చారణవలనా "గురుశిష్య సంబంధం" ఏర్పడినది అని చెప్పుటకు ఈ ఉదాహరణ.

మంత్రోపదేశం చేసిన వానిని గురువంటారు. ఈ మంత్రోపదేశం చేత గురుశిష్యుల మధ్య ఒక లంకె ఏర్పడుతుంది. ఆ మంత్రాన్ని వివరించవలసిన అవసరమూ లేదు. అది ఆచార్యుని పని. అకస్మాత్తుగా అనుద్దేశపూర్వకముగా ఒక మంత్రము ఉఛ్చరించినా గురువు అనుగ్రహం మంత్రం ద్వారా శిష్యుడిని సంక్రమిస్తుంది. లేదా ఆ మంత్ర శక్తి గురువు అనుగ్రహానికి మూలము అని కూడా చెప్పవచ్చును.

గురువు ఒక సిద్ధ గురువు అయితే, శిష్యుడు పరిపక్వమున్నవాడు అయితే, వాగ్రూపక మంత్రోపదేశమే అక్కర్లేదు. కానీ గురుశిష్యుల మధ్య ఒక సంబంధం మాత్రం ఏర్పడాలి. అది ఎట్లా సాధ్యం? గురువు శిష్యుని వంక ఒక మారు చూస్తే చాలు. అదే కటాక్ష దీక్ష అవుతుంది. వలసిన సంబంధం ఆ కటాక్షమే కలిగిస్తుంది. కటాక్షమాత్రాన శిష్యునికి జ్ఞానోపలబ్ధి ఏర్పడుతున్నది. గురువు శిశ్యుని శిరస్సుని స్పృశించడం కూడా దీక్షయే. దీనిని హస్త మస్తక దీక్ష అని అంటారు. కొన్ని సమయాలలో ఇవి ఏమీ అక్కర్లేదు, ఇవన్నీ స్థూల క్రియలు. గురువు సంకల్పం మాత్రాన "ఈ బిడ్డకు ఆరోగ్యం కలగాలి" అని అనుకున్న మాత్రంలో, అది ఉపదేశతుల్యమై గురుశిష్య సంబంధాన్ని వెంటనే సృష్టిస్తుంది.

(సశేషం....)



సర్వం శ్రీగురు చరణారవిందార్పణమస్తు.

-- SRI MOHAN KISHOR NEMMALURI

గురువు - ఆచార్యుడు

 "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు
శ్రీ గురుభ్యో నమః
శ్రీ గణేశాయ నమః
శ్రీ శరవణభవాయ నమః
శ్రీమాత్రే నమః
ఓం నమః శివాయ
శ్రీ సీతారామాభ్యాం నమః
శ్రీ హనుమతే నమః
గురుమూర్తే త్వాం నమామి కామాక్షీ!!

 
పెద్దలందరికీ నమస్కారము,

పూజ్యులు ప్రాతఃస్మరణీయులు కంచి కామకోటి పీఠం అరవై ఎనిమిదవ పీఠాధిపతులు,నడిచే దేవుడు, పరమాచార్య, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర స్వరస్వతీ మహాస్వామి వారు తమిళంలో చేసిన ప్రవచనములలో, "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" అనే అంశముపై చేసిన ప్రవచనముల యొక్క తెలుగు అనువాదము, కామకోటి వారి సైట్ లో లభిస్తే, దానినే యథాతథంగా, మరొక సారి పునశ్చరణ చేసినట్లు అవుతుందనీ, ఇలా వ్రాయడం వల్ల, జగద్గురువుల అనుగ్రహం లభిస్తుందనీ ఆర్తితో, నేను నేర్చుకోవడం కొరకు, నా ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసమై, ఇక్కడ వ్రాసుకుంటూ, అందరితోనూ పంచుకుంటున్నాను. తప్ప ఇక్కడున్న పెద్దలకు తెలియనివి కావు.


1. గురువు - ఆచార్యుడు
మనం సాధారణంగా వాడుకలో రెండు పద ప్రయోగాలు చేస్తూ ఉంటాము. ఇవి మనం పర్యాయ పదాలుగా భావించినా, పండితులు ఈ రెండిటినీ కాస్త భిన్న దృక్పథంలోనే చూస్తారు. ఆ పదాలే "గురువు", "ఆచార్యుడు".

ఆచార్యుడు అనే పదం - ఆచరణ, ఆచార అనే పదములకు సంబంధించినది. చర అంటే నడుచుత, చరిత, చరిత్ర అంటే నడత. దేశ చరిత్ర అంటే ఒక దేశములో ఏమేమి జరిగినదో తెలిపే పుస్తకం. జీవిత చరిత్ర అంటే ఒక మనిషి పుట్టినదాది ఏమేమి చేశాడో చెప్పే కథ. ఆచారం అంటే ఒక సమూహములోని వాడుకలు, నడవడికలు.

ఆచార్యుడు అంటే మనం జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధమైన నైతిక ప్రవర్తన శిష్టాచారములను అనుసరించాలో చూపే మార్గ దర్శకుడు. అహింస, సత్యము లాంటి సామాన్య ధర్మములు మనకున్నవి. మన మతములో ఎన్నో సాంప్రదాయాలున్నాయి. ఆచారాలున్నాయి. ఒక్కో సాంప్రదాయానికి వేర్వేరు శాస్త్రాలున్నవి, వైష్ణవులది ఒక ఆచారము, మాధ్వులకు మరొక ఆచారం. ఒక్క శైవ సాంప్రదాయములోనే ఎన్నో శాఖలున్నవి. వీరశైవం, కాశ్మీరశైవం, పాశుపతం, సిద్ధాంతము ఇత్యాదివి.

ఆచార్య పదం వివరించే ఒక శ్లోకం ఉన్నది ... "అచినోతిః శాస్త్రార్ధాన్ ఆచారే స్థాపయత్యపి - స్వయం ఆచారతేయశ్చ తం ఆచార్య ప్రచక్షతే".
ఎవడైతే శాస్త్రార్ధములను చక్కగా విచారిస్తున్నాడో (ఇతరులకు వాటిని బోధిస్తున్నాడని గర్భితం), ఆ ఆచారములను తాను స్వయముగా అనుష్టిస్తున్నాడో, అంతటితో వదలక, ఆ ఆచారములను ఇతరులచే అనుష్టింపచేస్తున్నాడో... అతడే ఆచార్యుడు. ఇతరులకు బోధ చేయడం, తాను స్వయంగా ఆచరించడం. ఈ రెండూ చేసేవాడే నిజమైన ఆచార్యుడు.

మనం ఆచారం, అనుష్టానం అంటూ ఉంటాము. అవి రెండూ పరస్పర సంబంధము కలవి. శాస్త్రోక్తములైన ఆచారములను అనుసరించేవే సంప్రదాయాలు. శాస్త్రములనేవి విధి, నిషేధాలను నిర్ణయించే గ్రంధాలు. సంప్రదాయాలు అనూచానంగా వచ్చే వాడుకలు, ఆచారాలు. వైదిక మతము ఆధారముగా ఏర్పడినవే శాంకర, రామానుజ ఇతర వైదిక సాంప్రదాయాలు. శాస్త్రములు సామాన్యముగా ఉన్నా సాంప్రదాయములు వేరుగా ఉండవచ్చు. ఈ విధంగా ఒక నియమ జీవనం చేస్తూ శాస్త్రోక్తమైన ఆచార అనుష్టానాలను పాటిస్తూ, ఇతరులకు బోధిస్తూ, వారిచే వాటిని అనుష్టింపచేస్తూ, తాను ఇతరులకు ఒరవడిగా ధర్మమూర్తిగా ఉన్నవాడే ఆచార్యుడు. అట్టి ఆచార్యునికి ఒక శిష్యుడు ఉండాలి. ఆ శిష్యునికి తన సాంప్రదాయ ధర్మములను బోధించి అనుష్టింపచేయాలి. అతడు విద్వాంసుడిగా ఉండాలి. విద్వత్తు లేకపోతే అతడు ఇతరులకి ఏమి బోధ చేయగలడు? తన అనుచరుల ధర్మ సందేహాలకు అతడు జవాబు చెప్పాలి. తన సాంప్రదాయానికి ప్రతి పక్షంవారికి యుక్తి యుక్తముగా జవాబు చెప్పాలి. అట్టివాడే ఆచార్యుడు అనిపించుకొంటాడు.

ఈ కాలంలో ఆచార్యులు బళ్ళు, కళాశాలలో ఉండే అధ్యాపకులు. వారికి ఆచరణలో కానీ, బోధనలో కానీ ఏ విధమైన ధర్మమూ లేదు. పూర్వకాలంలోనూ కళలకు ఆచార్యులు ఉండే వారు. ద్రోణాచార్య, కృపాచార్యులు ధనుర్వేద ఆచార్యులు. వారు వారి కళలలోనే కాక సాంప్రదాయములోనూ ధర్మములోనూ కుశలులు. వారి యొక్క అనుష్టానాలకే వారు గౌరవింపబడినారు.

2. గురు లక్షణం
ఆచార్యుని సమక్షంలోనే ఉంటూ విద్యాభ్యాసం చేయడం గురుకులవాసం. కానీ దానిని "ఆచార్య-కుల వాసము" అని మనం అనడం లేదు. అందుచేత గురువు-ఆచార్యుడు ఒక్కరే అని ఆర్ధం అవుతుంది. జగద్గురు శంకారాచార్య అని వ్యవహరించినప్పుడు, ఒకే వ్యక్తి గురువుగా, ఆచార్యుడిగా ఉన్నారని అర్ధం.

గురువు అంటే ఏమిటి? గురువు అనగా ఘనమైనది, పెద్దది అని అర్ధం. మహిమ కలవాడని అర్ధం. బ్రహ్మ అంటే కూడా గొప్ప, పెద్ద అని అర్ధం. గురువు దేనిలో పెద్ద?? మీరందరూ నన్ను పెరియావా, పెరియావర్ అని పిలుస్తారు. (ఈ మాటలు పరమాచార్య స్వామి వారు ప్రవచనాంతర్గతముగా భక్తులతో అన్నవి....). నేను దేనిలో పెద్ద? శరీర ప్రమాణంలోనా? నాకు శంకరాచార్యుడు అని పేరు ఉండడం వలన మీరందరూ ఆయన గుణగణములూ, మహత్వమూ నాలో ఉన్నదని ఏమరి, నన్ను పెరియావా అనీ, మహాన్ అనీ పిలుస్తున్నారు.

మొత్తం మీద గురువు అంటే అంతర్గతముగా ఒక ఉత్తమ స్థితిని అందుకొన్నవాడు అని తేలుతోంది. బాహ్యంలో ఒక వ్యక్తి యొక్క నడతా, విద్వతూ అతనిని ఆచార్యునిగా నిర్దేశిస్తుంది. అతని ఆచార అనుష్టానాల వలన, అతని బోధనా చాతుర్యం చేతనూ, అతని శీలసంపద చేతనూ మనం ఒకరిని ఆచార్యునిగా ఎన్నగలము.

ఇక గురువు మాట ఏమిటి? అతను బహిరంగముగా ఏదీ చేయవలసిన అవసరము లేదు. అతనికి శాస్త్ర పరిజ్ఞానమో విద్వత్తో ఉండనక్కర్లేదు. ఆచార్యుని వలె అతను సాంప్రదాయ, ఆచార అనుష్టానాలకు మార్గదర్శిగా ఉండనవసరమూ లేదు. అతను నోరు తెరిచి మాట్లాడవలసిన అవసరమూ లేదు. ఉపదేశాలు ఇవ్వనక్కర్లేదు. ఎంతో మంది మౌనగురువులు, ధ్యాననిష్ఠులు ఉంటారన్న విషయం మనకి తెలిసనదే.

తాను తానుగా ఉంటూ, ఏకాంతంగా పూర్ణత్వం భజిస్తూ, ఎవరైనా ఉంటే అతని ప్రభావం గుర్తించి ప్రజలు అతనిని గురువుగా వరిస్తారు. అంతమాత్రాన అతడు వీరికి శాస్త్రపాఠాలు చెప్పవలసిన అవసరము లేదు. అతనిని గురువుగా వరించిన వారికి అతని అనుగ్రహశక్తియే పనిచేస్తుంది. వీరిని అతడు శిష్యులుగా భావించి కూడా ఉండకపోవచ్చును. కానీ ఆయనను గురువుగా ఏ ఫలాన్ని ఉద్దేశించి ఆశ్రయించారో, ఆ ఫలం వీరికి శులభంగా సిద్ధిస్తున్నది.

ఏ శాస్త్రాచారమూ పాటించని ఇలాంటి గురువులెందరో ఉన్నారు. ఉన్మత్తులవలె, పిశాచముల వలే నిరంకుశులుగా తిరిగిన అత్యాశ్రములు ఎందరో గురువులుగా మన దేశంలో ఉండేవారు. ఈ విధంగా దిగంబరంగా తిరిగిన దత్తాత్రేయులు అవధూత గురువు అని ప్రసిద్ధి పొందారు.

ఒక మార్గాన్ని అనుసరించి పోయేవాడు ఆచార్యుడు. ఒక శాస్త్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ, అతడు శాస్త్ర నిష్ణాతగా ఉండడమే కాక, శాస్త్ర విధులను తాను అనుష్టిస్తూ ఇతరులకు బోధచేస్తూ, వారిచేత వానిని అనుష్టింపచేస్తూ
విధివిధానముగా మార్గదర్శకముగా ఉండేవాడే ఆచార్యుడు. గురువు అట్లా కాదు.  అతనిని మహాత్ముడు అంటారు, అతని ఆత్మానుభవం కొట్టొచ్చినట్లు కనబడుతూ ఉండడం చేతనే అతనిని ప్రజలు గురువుగా వరిస్తున్నారు. వారికి శీలానుష్టానాల అవసరం లేదు. వారికి శాస్త్ర విజ్ఞానం ఉండాలన్న నియమం లేదు. వారు జ్ఞానులు, వారెప్పుడూ బ్రహ్మ నిష్టలో ఉండేవారు. వారెప్పుడూ ఈశ్వర సాన్నిధ్యంలో ఉండే ఆనందోన్మత్తులగానో, చిత్తవృత్తుల నిరోధంతో సమాధి స్థితిలో ఉండే యోగులగానో ఉంటారు.

ఒక గురువు స్వయంగా "గురుత్వం" ఒప్పుకోకపోయినా, "నేను నీ శిష్యుడను" అని అతనిని ఆశ్రయించిన వాని మధ్యా, అయిష్టుడైన ఆ గురువు మధ్యా ఒక సంబంధం ఏర్పడుతుంది. ఈ సంబంధం అతని అనుగ్రహం వల్లనే. గురువు అంటే ఘనమైన వాడు అని చెప్పాము. ఒకరికి అంతరంగిక ఘనత ఉంటుంది. కానీ అతనికి బహిర్ప్రపంచముపైన ఏ కోరికా లేకపోవచ్చు. అతనికి అతని ఆత్మానుభూతిలోనే నిష్ట, అతడు గురువుగా చేయవలసిన కర్తవ్యం ఏదీ లేదు. 'గు' అంటే అంధకారం, 'రు' అంటే తన్నిరోధకం. గురువు అంటే చీకట్లను పారద్రోలేవారు. అజ్ఞాన నివర్తకుడు. దేశ శబ్దానికి ప్రకాశరూపి అని అర్ధం. "తమసోమాజ్యోర్గమయ". మనం అంధకారంలోంచి ప్రకాశంలోకి రావాలి. తమస్ అంటే చీకటి, జ్యోతిస్ అంటే వెలుతురు. అజ్ఞానం అంటే చీకటి, వెలుతురు (జ్ఞానం) ప్రకాశిస్తే కానీ చీకటి పోదు. ఒక విషయాన్ని గురువు బోధిస్తాడు. శిష్యుడు తన బుద్ధిచేత దానిని గ్రహిస్తాడు. అజ్ఞానమనే అంధకారంలో ఉన్న శిష్యునికి జ్ఞానబోధ చేయగలిగినది ప్రకాశరూపియైన గురువు ఒక్కడే.

ఒక మహాత్ముడుంటాడు, అతనికి శాస్త్ర విజ్ఞానం లేదు, అతని అనుష్టానమూ శాస్త్రీయము కాదు. శాస్త్రబోధ అతనికి కానిపని. అయినపటికి అతనిని ఎవరైనా 'గురువు'గా ఆశ్రయిస్తే, అతను ఆశ్రయితుడి అంతర్ధ్వాంతాన్ని అనయాసంగా పోగొట్టగలడు. అతని అనుగ్రహం చేత అనధీతమైన శాస్త్రాలన్నీ ఆశ్రితునికి అవగతాలౌతాయి.

గురువంటే చీకటిని పోగొట్టేవాడు. అతని ఆత్మశక్తి బహిర్ముఖంగా పనిచేస్తుంది. అతను వాగ్రూపముగా వరదానము చేయడంలేదు. మార్గదర్శకముగా ఉండాలన్న కోరికా అతనికి లేదు. అనుగ్రహం చేద్దామన్న ఇఛ్చయూ లేదు. కేవలం ఈశ్వర శక్తి, శిష్యుని గురుభక్తి మెఱుపువలే వరప్రదానం చేస్తుంది. అతను అల్పమైన ప్రాపంచిక విషయాభిలాయగానైనా ఉండవచ్చు. లేదా అతడు బ్రహ్మజ్ఞానాన్ని ఆర్జించి అయినా ఉండవచ్చు.

ఒక కర్తవ్యం జరగాలంటే గురు-శిష్య సంబంధం ఉండాలి. ఇంట్లో దీపం వెలిగించాలంటే, విద్యుఛ్చక్తికీ దీపానికీ మధ్య లంకె ఉండాలి. ఆ లంకె తంతి ద్వారా ఏర్పడుతుంది. జలాశయాలనుంచి ఇంట్లో కొళాయిలోకి నీళ్ళు రావాలంటే, పెద్దజలాశయము నుండి నగరానికి మధ్య పైపులు వేయాలి. అప్పుడే కొళాయి నుంచి నీళ్ళు రాగలవు. గురువు వాగ్రూపముగా ఉపదేశము చేస్తూ ఉంటే, గురుశిష్యుల మధ్య సంబంధం గురువు వాక్కులే. లేదా గురువు జీవితములోని ఆచార వ్యవహారాలే శిష్యుడికి ఉపదేశ ప్రాయముగా ఉంటాయి. గురువు మౌనముగా ఉంటూ ఒక సంకల్పము చేస్తే, అదే శిష్యునికి ఉపదేశమవుతుంది. గురువు ఉపన్యాసాల చేతనే ఉపదేశం చేయాలన్న నియమమేమీ లేదు. ఆయన జీవితమే ఒక పెద్ద ఉపదేశం. ఉపదేశ విధానము స్థూలమే కాదు, సూక్ష్మము కూడా.

ఒక గురువు వాగ్రూపముగానూ, తన ఆచార, అనుష్టానము చేతనూ శిష్యునికి బోధిస్తే, అతనిని ఆచార్యుడని అంటారు. ఒకడు ఉపదేశమూ చేయకపోవచ్చు. మార్గదర్శకంగా ఉండకుండా పోవచ్చు. కానీ అతని అనుగ్రహమే గురుశిష్యుల మధ్య ఏర్పడిన అవ్యక్త సంబంధమని ఇదివరకే చెప్పాను.. (పరమాచార్య వారి మాటగా దీనిని చదవగలరు..). ఆ అనుగ్రహమే అతడిచ్చే ఉపదేశము.

ఇట్లా ఉండే గురువులలో కొందరూ ఆచార్యులుగా ఉండడమూ కద్దు. శిష్యులకు బోధిస్తూ, శాస్త్రానుష్టానాలను స్వయంగా ఆచరిస్తూ అంతరంగములో సమాధి అవస్థలో ఉండగల గురువులూ ఉన్నారు. శంకర భగవత్పాదులు ఇటువంటి గురువులు. ఇతర సాంప్రదాయలలోనూ ఒకే వ్యక్తి గురువుగా ఆచార్యునిగా ఉన్నవారు ఉన్నారు.

పూర్వకాలములోని విద్యాగురువులు గొప్ప శీలమూ నిష్టా కలిగినవారు. ఆత్మానుభూతి కానీ, సమాధి అవస్థ కానీ వారు ఎరుగకపోవచ్చును. కానీ ఆచార అనుష్టానాల బలం చేత వారు గురుకులములను నడుపుతూ శిష్యకోటికి విద్యాదానం చేసేవారు. మరికొందరు స్వయంగానో, లేక శాస్త్ర సమ్మతమైన దానినో ఆశ్రితులకు ఉపదేశం చేసేవారు ఉండేవారు. అట్లు ఉపదేశం చేసిన వారి జీవిత కాలంలో వారి బోధనా విధానం శాస్త్ర విధానంగా పరిగణింపబడకపోయినా వారి అనంతరం వారి విధానం, వారి పేరిట చెలామణీ అయి వ్యాప్తి చెందేది. అట్టి గురువులు ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని అందుకున్నవారే. ఏ విధానానికి సంబంధించని గురువులూ ఎంతో మంది ఉన్నారు.

(సశేషం...)

సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.

-- SRI MOHAN KISHOR NEMMALURI